ఇంకా పదేళ్లు నేనే ముఖ్యమంత్రి ; రేవంత్ రెడ్డి
ఇంకా పదేళ్లు నేనే సీఎంగా ఉంటానని, ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే ఈ రాష్ట్రంలోఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెంటనే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నాడని, కేసీఆర్ ఎట్లా వస్తడో ఆయన సంగతేందో చూస్తానని ఆయన అన్నారు. ‘చంద్రశేఖర్రావు నీకు సూటిగా నేను సవాలు విసురుతున్నా ఈ పదేళ్లలో నా ఒక్క వెంట్రుకనైనా పీకుతావేమో చూడు..’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అయ్యిందని ఆయన అన్నారు. శాసనసభకు రావడానికి చేతకాని కేసీఆర్ వీల్ చైర్లలో నల్లగొండ సభకు వెళ్లి సెంటిమెంట్ డ్రామాలకు తెర తీస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
ప్రజలు మళ్లీ కేసీఆర్ మాయలో పడవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పోలీసు, జైళ్లు, అగ్నిమాపక, ఎక్సైజ్, రవాణా శాఖల్లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన మొత్తం 13,445 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సభలో ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. ‘కేసీఆర్ 3,565 రోజులు అధికారంలో ఉన్నారు ల్, అప్పుడే మా ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పదవులు లేకపోతే నెలల సమయం కూడా ఆగకుండా తన కూతురు కవితతో సహా అందరికీ నువ్వు పదవులు ఇచ్చారు.
జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పడిన గంటల వ్యవధిలోనే వారు వాళ్ల కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చుకున్నారు. 2019లో కూతురు కవిత ఓడిపోతే పాపం కేసీఆర్కు ఎంతో దుఖం వచ్చింది. ఆరు నెలలు తిరగకముందే మళ్లీ ఆమెను ఎమ్మెల్సీ చేశాడు ఇలా కుటుంబ సభ్యులు, బంధువులకు రాజకీయ పదవులు లేకపోతే వంద రోజులు కూడా ఆగని కేసీఆర్ నిరుద్యోగుల్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు. దాదాపు పదేళ్లుగా 30 లక్షల మంది యువత ఉద్యోగాలకు కోసం ఎదురు చూసేలా కేసీఆర్ చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంటే మాత్రం కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది. కామారెడ్డిలో కేసీఆర్ను అక్కడి ప్రజలు బండకేసి కొట్టి చిత్తు చిత్తు గా ఓడించారు. తెలంగాణను కుటుంబం కోసం బలి ఇచ్చిన కేసీఆర్కు తెలంగాణ యువ పోలీసులు తగిన బుద్ధి త్వరలోనే చెబుతారు. గత ప్రభుత్వంలోని కంచర గాడిదలను ఇంటికి పంపించి, రేస్ గుర్రాలను ప్రభుత్వంలోకి తెచ్చుకున్నామని ప్రజలు అనుకుంటున్నారు..’ అని రేవంత్ అన్నారు.
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం
ఉద్యోగ నియామకాలలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా, ఎవరికీ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను తప్పకుండా భర్తీ చేస్తాం. టీఎస్పీఎస్సీలో గతంలో జరిగిన అక్రమాలను నిలువరిస్తాం, పదేళ్లుగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 567 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాం.
నిరుద్యోగులకు నష్టం జరగకుండా వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచాము. అయితే పంజాబ్లో యువత గంజాయి, డ్రగ్స్తో నిర్వీర్యమైంది. ఆ పరిస్థితి తెలంగాణలో రాకుండా టీఎస్ న్యాబ్ విభాగాన్ని ఏర్పాటు చేసి పట్టిష్టం చేస్తున్నాం. పోలీస్ శాఖలో కొత్తగా భర్తీ అవుతున్న వారు కూడా తెలంగాణను గంజాయి, మత్తుపదార్థాలు లేని రాష్ట్రంగా మార్చుతామని ప్రతినబూనాలి. రాష్ట్రంలో డ్రగ్స్ వాడాలంటే వణుకు పుట్టే పరిస్థితి రావాలి..’ అని సీఎం అన్నారు.