CM Revanth Reddy fixed target on tax collection ; Telangana
పన్ను వసూళ్లలో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు కచ్చితంగా సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల వారికి ఆదేశించారు. 2023-2024 సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పరమైన పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖ పన్నుల వసూళ్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శాఖల వారితో సమీక్ష నిర్వహించారు.
ఇకపోతే వాణిజ్య పన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి, రాబడికి మధ్య ఇంత వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని ముఖ్యమంత్రి ఆయా శాఖల వారిని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లకుపైగా రాష్ట్రానికి చెల్లించేదని, దాని గడువు ముగియడంతో ఆ నిధులు రాకపోవడంతో రాబడిలో ఈ వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంతే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మన రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలకు సంబంధించిన లెక్కలలో తేడాలు ఉంటున్నాయని, ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి డిస్టలరీ వద్ద కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చి వాటి రాక పోకలను ట్రాకింగ్ చేయాలని, బాటిల్ ట్రాకింగ్ సిస్టం ఉండాలని, మద్యం సరఫరా చేసే వాహనాలు వే బిల్లులు కచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్తో పాటు గతంలో నమోదు చేసిన పలు కేసుల పురోగతిపై నివేదిక ఆయనకు త్వరగా సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు ఆయనకు తెలిపారు. అదే సమయంలో తమ తమ శాఖలోనూ అదే పరిస్థితి నెలకొందని వాణిజ్య పన్నుల శాఖ యొక్క కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయం పై స్పందించిన ముఖ్యమంత్రి ఆదాయాన్ని తెచ్చే శాఖలకు సొంత భవనాలు లేకపోవడం సరికాదని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాలు నిర్మించేందుకు త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
శాఖల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్తో పాటు నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులపై కంకర కుప్పలుగా కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారని, అలా కాకుండా నగరంలో వివిధ ప్రదేశాల్లో ప్రభుత్వ యొక్క స్థలాలను అందుకు వినియోగించాలన్నారు.
ఇక ఇసుక విక్రయాలపై సమగ్ర విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. వే బిల్లులతో పాటు ఇసుక సరఫరా వాహనాలకు కూడా ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు ఎట్టి పరిస్థితిలో కూడా అవకాశం ఇవ్వవద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ పలు గనులపై గతంలో జరిమానాలు విధించారని, కేసులు కూడా నమోదు చేశారని ముఖ్యమంత్రి వారికి గుర్తు చేశారు. విధించిన జరిమానాలను వెంటనే వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
మరి గతంలో జరిమానాలు విధించి తర్వాత వాటిని మళ్లీ తగ్గించారని, అందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని, దానిపై ఒక సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. టీఎస్ ఎండీసీతో పాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి వారు తిష్ట వేశారని, కొందరిపై కొన్ని ఆరోపణలున్నాయని, వారిని వెంటనే వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆయా శాఖలలో ఉన్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు. more